రుచికరమైన భోజనం అందించండి
● ఇష్టారీతిగా వండితే సహించేది లేదు ● కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: పాఠశాలల్లోని విద్యార్థులకు రుచికరంగా భోజనం అందించాలని, ఇష్టారీతిగా వండితే సహించేది లేదని కలెక్టర్ హైమావతి వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని ఇర్కోడ్ తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బిర్యానీ అన్నం, ఆలుగడ్డ టమాటా కూర, సాంబారును పరిశీలించారు. వంటలు సరిగ్గా వండకపోవడంతో సిబ్బందిపై మండిపడ్డారు. కామన్ డైట్ మెనూ పాటిస్తూ వంట నాణ్యతగా వండాలన్నారు. అనంతరం ప్రాంగణంలోని ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. రోజువారి భోజనం వివరాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యను కలెక్టర్కు సిబ్బంది తెలపగా ఇంజనీరింగ్ అధికారులను పంపించి తప్పనిసరిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.


