పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలి
సిద్దిపేటరూరల్: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పండిట్, పీఈటీ పోస్టులను వెంటనే అప్గ్రేడ్ చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గాడిపల్లి తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జిల్లాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మూడు దశల పోరాట కార్యక్రమాలు తలపెట్టామన్నారు. అందులో భాగంగా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేస్తున్నట్టు చెప్పారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలలో పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి తెలుగు, హిందీ పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్ స్థాయి పోస్టులుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం ఇచ్చిన హామీలను అమలు చేసి, కనీస సమయవేతనం అందించాలని కోరారు. అన్ని ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, సక్రమంగా వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు విజేందర్రెడ్డి, నరేందర్, అనిల్కుమార్, రాంకిషన్, దశరథం, శివరాజం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర నేత తిరుపతిరెడ్డి


