నిధులు వచ్చేనా.. సమస్యలు తీరేనా?
సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాలిటీల్లో.. నిధుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని నెలల కిందట టీయూఎఫ్ఐడీసీ(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నిధుల అంశం ఇంకా టెండర్ దశలోనే ఉండటంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. 15వ ఆర్థిక సంఘం ఫండ్స్పై స్పష్టతకు మార్చి నెలాఖరు వరకు ఆగాల్సి ఉన్నది. ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను అందజేసి త్వరగా పనులు ప్రారంభిస్తేనేసమస్యలు తీరనున్నాయి. – గజ్వేల్
జిల్లాలోని మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా టీయూఎఫ్ఐడీసీ ద్వారా నిధులు వచ్చాయి. ఇందులో గజ్వేల్, సిద్దిపేటలకు రూ.18.7కోట్ల చొప్పున, మిగతా మున్సిపాలిటీలకు రూ.15కోట్లకుపైగా విడుదలయ్యాయి. ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో ప్రాధాన్యత క్రమంలో పనులను ప్రతిపాదించారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన వేళ.. ఈ పనుల ప్రారంభానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మార్చి నెలాఖరు వరకు ఆగాల్సిందే..
జిల్లాలోని మున్సిపాలిటీలకు 15వ ఆర్థిక సంఘం–2026 ద్వారా నిధులపై స్పష్టత కోసం మార్చి నెలాఖరు ఆగాల్సిందే. జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీకి ఇప్పటికే పాలకవర్గం ఉండగా, కొన్ని రోజుల కిందట గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాలలో ఎన్నికలు పూర్తయి.. పాలకవర్గాలు కొలువుదీరిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, పన్నుల వసూళ్లు తదితర అంశాలను ప్రతిపాదికగా తీసుకొని నిధులను విడుదల చేయనున్నారు.
పెండింగ్ వాటికి మోక్షం లభించేనా?
మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడీసీ, 15వ ఆర్థిక సంఘం నిధులే కాకుండా జనరల్ ఫండ్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా వచ్చే నిధులు వినియోగంలోకి వస్తేనే పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తున్నది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇందిరాపార్క్ కూడలి, ఇతర కూడళ్ల సుందరీకరణ, చిల్డ్రన్స్ పార్కు అభివృద్ధి, ప్రధాన రహదారులపై పెండింగ్లో ఉన్న సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ మరమ్మతులు, సీసీ రోడ్లు ఇతర సమస్యల పరిష్కారానికి టీయూఎఫ్ఐడీసీ పనుల్లో ప్రతిపాదించారు. కానీ నేటికీ పనులు ప్రారంభం కాలేదు. జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే నిధులపైనే ఆశలు పెట్టుకున్నారు.
దశలవారీగా పరిష్కారం
టీయూఎఫ్ఐడీసీ పనులు టెండర్ దశలో ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వచ్చే అవకాశం ఉంది. రాగానే ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతాం. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాం.
– వెంకటగోపాల్, మున్సిపల్ కమిషనర్,
గజ్వేల్–ప్రజ్ఞాపూర్
టెండర్ దశలోనే టీయూఎఫ్ఐడీసీ పనులు
‘ఆర్థిక సంఘం’ ఫండ్స్పై కానరాని స్పష్టత
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
జిల్లాలోని మున్సిపాలిటీల దుస్థితి
నిధులు వచ్చేనా.. సమస్యలు తీరేనా?


