‘రైతు భరోసా’ వెంటనే ఇవ్వండి
కొండపాక(గజ్వేల్): రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కుకునూరుపల్లి మండల కేంద్రంలో రైతు బంధు సమితి రాష్ట్ర మాజీ కో ఆర్డినేటర్ దేవీ రవీందర్ ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవీ రవీందర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆకుల భద్రప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. యాసంగి రైతు భరోసాను వెంటనే విడుదల చేసి, నాణ్యమైన కరెంటును ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్గౌడ్, మధుమోహన్, భాస్కర్, కరుణాకర్, సుదర్శన్, మహిపాల్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. సైక్లింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడాధికారి వెంకటనర్సయ్య మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 400 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యదర్శి సౌందర్య, కోచ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్
చిన్నకోడూరు(సిద్దిపేట): ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలని, లక్ష్యాలకు అనుగణంగా ప్రతిభావంతులు కావాలని ముదిరాజు హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి జంగిటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం చిన్నకోడూరులో జానపద కళాకారుడు స్వామి, కానిస్టేబుల్ లక్ష్మణ్లు గాయకులుగా అవార్డులు రావడంతో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ముదిరాజులు స్వామి, లక్ష్మణ్లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముదిరాజులు రాణించాలన్నారు. సమాజంలో వెనుకబడి ఉన్నారని అన్నారు. సర్పంచ్ శ్రీనివాస్, సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశం, ముత్యం, బాలయ్య, రాజేశ్, నాగరాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి జాతర అనంతరం మొదటి ఆదివారం కావడంతో పాటు మరో మూడు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బారులు తీరిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసి బోనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సత్రాలు లభించక ఇబ్బందులు పడ్డారు. ఈఓ వీరేశం, ఎస్ఐ శ్రీనివాస్గౌడ్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
‘రైతు భరోసా’ వెంటనే ఇవ్వండి
‘రైతు భరోసా’ వెంటనే ఇవ్వండి


