
తీరుతున్న వేళ
ఏళ్ల కల..
హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల
ఈ ప్రాంత విద్యార్థుల ఎన్నో ఏళ్ల కల సాకారం కాబోతోంది. ఇంజనీరింగ్ విద్య చదివే విద్యార్థులకు మంచి రోజులు రాబోతున్నాయి. హుస్నాబాద్ ప్రాంతంలో డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మాపూర్ ప్రాంతంలో 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మంగళవారం భూమిని చదును చేసే పనులను కలెక్టర్ పరిశీలించారు.
హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హుస్నాబాద్కు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 విద్యా సంవత్సరం నుంచే కళాశాల స్థాసనకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కళాశాల నిర్మాణానికి రూ.44.12 కోట్ల నిధులు సైతం ప్రభుత్వం మంజూరు చేసింది. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గుట్టల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం కోసం 30 ఎకరాల భూమిని కేటాయించారు. భూమి చదును చేసే పనులు ప్రారంభించారు. కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి పనులను పరిశీలించారు.
జిల్లాలోనే మొదటి కళాశాల
జిల్లాలోనే హుస్నాబాద్లో మొట్ట మొదటి ఇంజనీరింగ్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ (ఐటీ), బీటెక్ (ఈసీఈ) ప్రతి ప్రోగ్రాంలో 60 సీట్లను కేటాయించారు. మరో రెండు నెలల్లో కళాశాలలో ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. కళాశాల నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు తాత్కాలికంగా హుస్నాబాద్లోని పాలిటెక్నిక్ కళాశాల పై అంతస్తులో తరగతులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి పొన్నం ఘనత
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక శ్రద్ధ చూపి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయించారు. కరీంనగర్కు మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలను హుస్నాబాద్కు తరలించడంపై కరీంనగర్లోని కొందరు నేతలు అభ్యంతరం చెప్పి వివాదానికి తెర లేపారు. ఎవరు ఎమన్నా మంత్రి పొన్నం తనను గెలిపించిన హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కళాశాలను తీసుకురావడంలో విజయం సాధించారు.
డబుల్ రోడ్డు నిర్మాణానికి..
పొతారం (ఎస్) నుంచి ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లేందుకు రహదారి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.11 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఇంజనీరింగ్ కళాశాలతో హుస్నాబాద్ ప్రాంతం రవాణా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
నిర్మాణానికి చర్యలు ముమ్మరం
30 ఎకరాల్లో భూమి కేటాయింపు
చదును చేసే పనులను పరిశీలించిన కలెక్టర్
విద్యాభివృద్ధికి కృషి
హుస్నాబాద్ ప్రాంతాన్ని విద్యాపరంగా మరింత అభివృద్ధి చేస్తా. ఇంజనీరింగ్ కళాశాలతో పేద విద్యార్థులకు ఎంతో మేలు. ఇంజనీరింగ్ విద్య కోసం పట్టణాలకు వెళ్లకుండా విద్యార్థుల ముంగిటకే కళాశాలను తెచ్చాను. భవిష్యత్లో విద్యాపరంగా మరిన్ని సదుపాయాలు కల్పిస్తా. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలి.
– పొన్నం ప్రభాకర్,
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

తీరుతున్న వేళ