అభ్యసన సామర్థ్యం పెరిగేలా బోధించాలి
హుస్నాబాద్: విద్యార్థులకు అర్థమయ్యేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ట్రైనీ కలెక్టర్ ఫైజల్ అహ్మద్, నోడల్ అధికారులు, క్లస్టర్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డివిజన్ అధికారులకు సూచించారు. విద్యార్థుల కనీస సామర్థ్యం పెంచేలా చూడాలన్నారు. చదవడం, రాయడం, గణితంలో మెళకువలను నేర్పించాలన్నారు. టీచింగ్, లర్నింగ్ మెటీరియల్తో అందరికీ అర్థమయ్యేలా బోధన చేయాలన్నారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి విద్యార్థులు ఆడియో పాఠాలు వినేలా, ప్రతీ రోజు డైరీ రాసేలా అవగాహన కల్పించాలన్నారు. మండల అధికారులు నెలలో రెండుసార్లు పాఠశాలలను సందర్శించి, పర్యవేక్షణ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి బేతి భాస్కర్, ఎంఈఓలు దేశిరెడ్డి, నర్సింహరెడ్డి, పావని, బండారి మనీల, సీఆర్పీలు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్