కల్హేర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన
కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు చివరి ఆయకట్టు కింద ఎండుతున్న పంటలు కాపాడేందుకు సాగు నీరు అందించాలని శుక్రవారం కల్హేర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేశారు. ఇందిరానగర్, కల్హేర్ వద్ద నల్లవాగు ఆయకట్టు కింద సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. నల్లవాగు కాల్వల్లో పిచ్చి మొక్కలు, పూడిక నిండటంతో చివరి ఆయకట్టు వరకు నీరు చేరడంలేదని తెలిపారు. అధికారులు వెంటనే నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ శివశ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు.
కదిలిన అధికార యంత్రాంగం
నల్లవాగు ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండిపోతుండటంతో నీటి పారుదల శాఖ అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ‘రైతన్నలకు తప్పని నీటి గోస’శీర్షికతో సాక్షిలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మరో పక్క రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో నీటి పారుదల శాఖ డీఈఈ ఎజాజ్, ఎఈ శ్రీవర్ధన్రెడ్డి కృష్ణాపూర్, ఇందిరానగర్ వద్ద నల్లవాగు కుడి కాల్వను పరిశీలించారు. కాల్వల్లో చెట్లు, పూడిక తొలగించి నీటి సరఫరా చేసేందుకు వెంటనే చర్యలు తీసకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగన్న, రైతులు ఉప్పరి విఠల్, సాయిలు, ప్రకాశ్ పాల్గొన్నారు.


