లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్జోన్: చిన్నపాటి వివాదాలను పెద్దవిగా చేసుకుని కోర్టుల చుట్టూ తిరగకుండా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ మంచి అవకాశమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను కక్షిదారులు పరస్పర అవగాహనతో రాజీపడాలని కోరారు. దీంతో సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. కాగా రాజీ పడదగిన కేసులను గుర్తించి సంబంధిత కక్షిదారులకు అవగాహన కల్పిస్తూ పరిష్కారానికి పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది కృషి చేస్తారని తెలిపారు. రాజీ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే వారు సంబంధిత పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.


