కల్హేర్(నారాయణఖేడ్): గుర్తుతెలియని వాహనం ఢీకొని లేగదూడ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం నిజాంపేట్ మండలం బాచేపల్లి వద్ద 161 నేషనల్ హైవేపై చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బద్దరం నాగయ్య పశువులను రోడ్డు దాటిస్తున్న క్రమంలో వాహనం ఢీకొని లేగదూడ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలని బాధిత రైతు అధికారులను కోరారు.
ఇద్దరు అదృశ్యం
పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన భానూర్ పోలీస్స్టేషన్న్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామచంద్రాపురం పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన సువర్ణ(51), భర్త లక్ష్మినారాయణతో మంగళవారం రాత్రి గొడవ పడింది. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
బీటెక్ విద్యార్థి..
వర్గల్(గజ్వేల్): బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలోని గుంటిపల్లిలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్సై ఆరోగ్యం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొమ్మ సందీప్(17) గౌరారం సమీప యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. రోజు మాదిరిగా మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితులు, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. బుధవారం తండ్రి కనకయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కల్హేర్(నారాయణఖేడ్): పంట చుట్టూ కరెంట్ తీగలతో కంచె ఏర్పాటు చేసేందుకు వెళ్లిన యువకుడు షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబీకులు, తండావాసుల కథనం ప్రకారం.. ఇందిరానగర్ తండాకు చెందిన మలోత్ జైపాల్(32) తోటి స్నేహితుడికి సంబంధించిన వరి పొలం వద్ద అడవి పందులు రాకుండా కరెంట్ తీగలు పెట్టేందుకు కలిసి వెళ్లాడు. పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసేందుకు స్నేహితుడికి సహకరిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా జరగడంతో జైపాల్ తీవ్రంగా గాయపడి పంట పొలంలోనే మరణించాడు. మృతుడికి భార్య సునీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.


