గజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పిడిచెడ్ గ్రామానికి చెందిన గద్ద గంగయ్య(45) తుర్కపల్లిలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగా బుధవారం విధులకు వెళ్లాడు. సమీప బంధువు చనిపోవడంతో భార్య ఊరికి వెళ్లాలని గంగయ్యకు ఫోన్ చేయడంతో అతడు బయలుదేరాడు. కాగా తుర్కపల్లిలో లిఫ్ట్ అడిగి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. మార్గమధ్యలో ప్రజ్ఞాపూర్ శివారు పాతూరు ప్లైఓవర్ బ్రిడ్జీ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద వెనుక నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరి బైక్ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి, వెనుక కూర్చున్న గంగయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా గంగయ్య మార్గమధ్యలో మృతి చెందాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
టిప్పర్ ఢీకొట్టడంతో వ్యక్తి..
పటాన్చెరు టౌన్: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్కు చెందిన రాజు(33) తన స్నేహితుడు సాయి కిరణ్తో కలిసి మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. సాయి కిరణ్ వాహనం నడుపుతుండగా రాజు వెనుక కూర్చున్నాడు. సంగారెడ్డి నుంచి పటాన్చెరు వైపు వస్తున్న టిప్పర్ వీరి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. వెనుక కూర్చున్న రాజు రహదారిపై పడిపోవడంతో అతనిపై నుంచి టిప్పర్ వెళ్లింది. ఈ ప్రమాదంలో అతడికి కాళ్లకు, తలకు గాయాలయ్యాయి. పటాన్చెరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.


