● అనుమతులు లేకున్నా అడిగేవారు కరువు
● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రేకుల షెడ్లు
హత్నూర(సంగారెడ్డి): అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. అధికారుల అనుమతి లేకున్నా బడాబాబులు ఇష్టారాజ్యంగా రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు. హత్నూర మండలం ముచ్చర్ల గ్రామ శివారులో సర్వే నంబర్ 98, 242లో అసైనన్డ్ భూములను ప్రభుత్వం పేదలకు కేటాయించింది. ఆ భూములను రాజకీయ నాయకులు, బడా కాంట్రాక్టర్లు కొనుగోలు చేశారు. పక్క నే ఆనుకొని ఉన్న తురకల ఖానాపూర్ శివారులోని అసైనన్డ్ భూములు సైతం లీజు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించారు. ఇంకేముంది ఇష్టానుసారంగా రేకుల షెడ్లు నిర్మించారు. వాటిని ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
బడా నాయకుల బరితెగింపు
అనుమతుల్లేని నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో బడా నాయకులు బరితెగించి నిర్మాణాలు కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పంటల సాగు కోసం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినా, ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముచ్చర్ల– తురకల ఖానాపూర్ శివారులోని మల్కాపూర్– పటాన్చెరు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని కబ్జా చేసి రేకుల షెడ్ల నిర్మాణాలు చేపట్టి వాణిజ్య, వ్యాపార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో బడాబాబులు అనుమతులు లేకున్నా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నా రు. మండల అధికారులు ఎలాగూ స్పందించడం లేదని, కనీసం కలెక్టర్ అయినా అసైన్డ్ భూములను కాపాడాలని కోరుతున్నారు.


