సంగారెడ్డి జోన్: కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం కాళోజీ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో వేర్వేరుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి అక్షర యోధుడిగా కాళోజీ నిలిచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
మట్టి వినాయకులనే పూజించాలి
పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మండపాల ఏర్పాటులో నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిర్వాహకులు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


