గడువు కోరిన
వ్యాపారులు
జహీరాబాద్ టౌన్: పట్టణంలో రోడ్ల విస్తరణ పనులకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. భవానీ మందిర్, హనుమాన్ మందిర్ రహదారులను 40 అడుగుల వెడల్పుతో విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీల సహాయంతో దుకాణాల ఎదుట భాగంలోని మెట్లను తొలగిస్తూ కూల్చివేత పనులు ప్రారంభించారు. అయితే, జేసీబీలతో నేరుగా కట్టడాలు తొలగిస్తే భవనాలు తీవ్రంగా దెబ్బతింటాయని భావించిన వ్యాపారులు.. తామే స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకుంటామని అధికారులకు విన్నవించారు. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించి, ఈనెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆ తేదీలోగా మార్కింగ్ వరకు ఉన్న కట్టడాలను స్వయంగా తొలగించుకోవాలన్నారు. లేనిపక్షంలో మున్సిపల్ సిబ్బంది కూల్చివేత పనులు కొనసాగిస్తారని స్పష్టం చేశారు. కాగా, రోడ్ల విస్తరణతో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


