కంగ్టి(నారాయణఖేడ్): పాముకాటుకు గురై బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రాంతీర్థం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పార్వతి, నగేశ్ దంపతులు తమ కుమారుడు సూర్య(12)తో కలిసి చేనులో వ్యవసాయం పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు పాము కరిచినట్లు బాలుడు తెలుపడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అక్కడి నుంచి నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో బాలుడు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఏకై క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
చికిత్స పొందుతూ వివాహిత..
బెజ్జంకి(సిద్దిపేట): చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందింది. కుటుంబీకుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చీమలకుంటపల్లెకు చెందిన తుమ్మ కొమరయ్య గతంలో ఉపాధి నిమిత్తం బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామానికి వచ్చాడు. అతని పెద్ద కుమార్తె తేజ(27)కు గ్రామంలోని మెండ రాజుతో 2018లో పెళ్లి చేశాడు. ఆ తరువాత కొమరయ్య స్వగ్రామానికి కుటుంబంతో తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తేజకు తమ కుటుంబాన్ని కలవలేననే బాధ ఉండేది. ఈనెల 4న తేజ ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన బంధువులు వెంటనే అంబులెన్సులో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తేజ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


