ప్రశాంత్నగర్(సిద్దిపేట): నీతినిజాయితీతో కూడిన రచనలనే ప్రజలు ఆదరిస్తారని సీనియర్ రచయిత, ఉపాధ్యాయ ఉద్యమనేత దారం మల్లారెడ్డి, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి పేర్కొన్నారు. వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన కవిసమ్మేళనంలో, దారం మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరి జ్ఞానాన్ని అంది పుచ్చుకుంటూనే లక్ష్యసాధన దిశగా రచనలు సాగాలని సూచించారు. వర్తమాన సమాజం అనేక సంక్షోభాలతో సతమతమవుతున్నదని, దీని వెనకున్న సూత్రధారులు, పాత్రధారులెవరో తేటతెల్లం చేయాల్సిన బాధ్యత రచయితలపై ఉందన్నారు. సహజ వనరులను చెరబట్టేందుకు కార్పోరేట్ శక్తుల పన్నాగాలను తమ రచనల ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి పర్కపెల్లి యాదగిరి, స్రవంతి మహిపాల్, మహమూద్ పాషా, అశోక్ రాజు, కొమురవెల్లి అంజయ్య, బోరెడ్డి మధుసూదన్ రెడ్డి, సుధాకర్, తాటికొండ విష్ణుమూర్తి, అందె ప్రవీణ్, రాజయ్య, రమేశ్ లాల్, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఉద్యమనేత దారం మల్లారెడ్డి


