వెల్దుర్తి(తూప్రాన్ ): విద్యుత్ షాక్తో రైతు కూలీ మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మండల కేంద్రం వెల్దుర్తిలో చోటుచేసుకుంది. ఎస్సై కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం.. శేరిల గ్రామానికి చెందిన మిర్జపల్లి లక్ష్మి, యాదగిరి దంపతుల కుమారుడు రఘుపతి(28) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం వెల్దుర్తి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద గట్టుపై గడ్డి తొలగించే పనికి వెళ్లాడు. గట్టుపై యంత్రంతో గడ్డిని తొలగిస్తుండగా, అక్కడే ఉన్న బోర్ మోటార్ విద్యుత్ తీగలకు యంత్రం తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సునీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తను కోల్పోయిన భార్య రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.


