కొండపాక(గజ్వేల్): గణనాథుడి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఐదుగురురికి తీవ్ర, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. కొత్తగూడెంలో భారీ ఎత్తున విగ్రహం ఏర్పాటు చేసేందుకు యువకులు హైదరాబాద్లో విగ్రహాలు తయారు చేస్తున్న చోట ఖరీదు చేశారు. ఈ క్రమంలో ఈనెల 14న గణనాథుడిని ప్రతిష్టించేందుకు ఆదివారం హైదరాబాద్ నుంచి ట్రాక్టరు సహాయంతో గణనాథుడిని ట్రాలీలో 8 మంది యువకులు తీసుకెళ్తున్నారు. కాగా కొత్తగూడెంకు గణనాథుడిని తీసుకెళ్లేందుకు హైదరాబాద్ నుంచి వరంగల్ దారి వెంట ఉన్న లోలెవల్ బ్రిడ్జిల వద్ద నుంచి తీసుకెళ్లడం సాధ్యం కాదని సిద్దిపేట, హుస్నాబాద్ మీదుగా తీసుకెళ్తున్నారు. కాగా దుద్దెడ శివారులోని కలెక్టరేట్ వద్ద రాజీవ్ రహదారిపై రెండు వైపులా విద్యుత్తు వైర్లు అడ్డుగా ఉండటంతో గణనాథుడిని తీసుకెళ్తున్న యువకులు దిగి కర్ర సహాయంతో వైర్లను సరి చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపునకు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ యువకులను ఢీకొట్టి గణనాథుడిని తీసుకెళ్తున్న ట్రాలీని సైతం ఢీకొట్టింది. దీంతో ఐదుగురు యువకులకు తీవ్ర, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పాటు గణనాథుని విగ్రహం ఎగిరి సుమారు 10 గజాల దూరంలో రోడ్డుపై పడగా నుజ్జునుజ్జు అయ్యింది. క్షతగాత్రులను అంబులెన్స్లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్రేన్ సహాయంతో గణనాథుడి విగ్రహాన్ని ప్రక్కకు జరిపి, ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణమైన సిమెంట్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురికి తీవ్ర, ముగ్గురికి స్వల్ప గాయాలు
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు


