సిద్దిపేటరూరల్: ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రూరల్ సీఐ విద్యాసాగర్ కేసు వివరాలు వెల్లడించారు. దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన ఆస సుదర్శన్ ఇటీవల హైదరాబాదులో వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పని చేస్తుండగా కాలుకు ఫ్రాక్చర్ అయింది. దీంతో సరైన పనిలేక, డబ్బుల కోసం ఆలయాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో నాంచారుపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి గుడిలో రెండు గుడి గంటలు, ఇర్కోడు ఎల్లమ్మ గుడిలో రెండు గంటలు, హుండీని ఎత్తుకెళ్లి డబ్బులు తీసుకుని పొలాల్లో పడేశాడు. దొంగిలించిన గంటలను సిద్దిపేటలో షాపులో అమ్మివేశాడు. అలాగే 4వ తేదీన రాఘవాపూర్ ఎల్లమ్మ గుడిలో 3 గంటలు, అదే రోజు ముస్తాబాద్ మండలం బదనకల్లోని ఎల్లమ్మ గుడిలో 2 గంటలు దొంగిలించి రంగధాపల్లి చౌరస్తాలో గల స్క్రాప్ షాపులో విక్రయించాడు. ఈ క్రమంలో శనివారం బూరుగుపల్లి ఎల్లమ్మ గుడి వద్ద మరో దొంగతనానికి కాపు కాస్తుండగా సమయస్ఫూర్తితో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనం, హెల్మెట్, రించ్ పానా, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో సుదర్శన్ పలుమార్లు జైలుకు సైతం వెళ్లొచ్చినట్లు పోలీసులు తెలిపారు.
తండ్రి మృతికి కారణమైన కొడుకు రిమాండ్
ములుగు(గజ్వేల్): తండ్రి మృతికి కారణమైన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రఘుపతితో కలిసి గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని అడవిమజీద్ గ్రామానికి చెందిన కొమ్ము నవీన్ కుటుంబ సమస్యలతో తన తండ్రి ఆంజనేయులుపై దాడి చేశాడు. దీంతో గాయపడిన తండ్రి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లభించిన ప్రాథమిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ప్రకారం పోలీసులు నిందితుడు కొమ్ము నవీన్ను ఈ నెల 5న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని గజ్వేల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.


