శివ్వంపేట(నర్సాపూర్): రానున్న కాలంలో ఇంధన వినియోగాన్ని తగ్గించుకునేందుకు ఎలక్ట్రానిక్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం వాహనదారులపై ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని శభాష్పల్లిలో ఈవీ చార్జింగ్ స్టేషన్ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. బయటి దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం 5లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. దీన్ని అధిగమించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తూప్రాన్ – నర్సాపూర్ హైవే బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని విలేకరులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రైల్వే ఉన్నతాధికారులను ఫోన్లో ఆదేశించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఈవీ చార్జింగ్ స్టేషన్ యజమాని సాదుల్లా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, మండల అధ్యక్షుడు రవి, సర్పంచులు యాదగిరి, కుమార్, బీజేపీ నాయకులు కొండల్రావు, రమేశ్గౌడ్, నర్సారెడ్డి, భిక్షపతి, అంజి ఉన్నారు.
ఈవీ చార్జింగ్ స్టేషన్ ప్రారంభం
ఎంపీ రఘునందన్ రావు


