సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలో విద్యారంగానికి విశిష్ట సేవలందించిన 100 మంది ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంజిరెడ్డి మాట్లాడుతూ..ఉపాధ్యాయులను సన్మానించడం ద్వారా వారి సేవలను గౌరవించడమే కాకుండా, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు , సమాజంలోని ప్రతి ఒక్కరికీ అది మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు తమ విలువైన సమయాన్ని సెల్ఫోన్, సామాజిక మాధ్యమాల్లో వృథా చేయకుండా చదువు, క్రీడలు, పుస్తక పఠనంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంగీత, నారాయణఖేడ్ సబ్కలెక్టర్ ఉమాహారతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత, జిల్లా విద్యాధికారి రోహిణి ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి


