జహీరాబాద్ టౌన్: బడి లేని ఊరు ఉండొచ్చు కానీ పాఠశాలలో పిల్లలు లేని పరిస్థితి రాకూడదని సంకల్పించారు. ప్రైవేట్ వైపు పరుగెడుతున్న గ్రామాన్ని ప్రభుత్వ పాఠశాల వైపు అడుగులు వేయించారు హెచ్ఎం దేవిసింగ్ రాథోడ్. మండలంలోని గోవింద్పూర్లో ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ మెజార్టీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లేవారు. ఇందుకు హెచ్ఎం. దేవిసింగ్ రాథోడ్ గ్రామస్తులతో పలు సార్లు సమావేశం నిర్వహించి నాణ్యమైన విద్యబోధనపై ప్రచారం చేశారు. గ్రామ పంచాయతీతో పాటు ప్రజల సహకారంతో పాఠశాల భవనాన్ని అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ తరహా డ్రెస్ కోడ్ అమలు చేశారు. దీంతో విద్యార్థుల సంఖ్యతో పాటు విద్యాప్రమాణాలు మెరుగ్గుపడ్డాయి. ఆయన సేవలకు గుర్తింపుగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడితో పాటు బెస్ట్ టీచర్, రైసింగ్ తెలంగాణ అవార్డును పొందారు.


