తూప్రాన్: జేసీబీ సబ్సిడీ విషయంలో లబ్ధిదారురాలిని వేధించిన ఓ బ్యాంకుకు సంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. అక్రమంగా వాహనాన్ని సీజ్ చేసినందుకు బ్యాంకుకు భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. వివరాలు ఇలా.. మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన బజారు భాగ్యలక్ష్మి స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్థిరపడటానికి 2020లో ప్రభుత్వం రూ.12.24లక్షల సబ్సిడీతో జేసీబీని మంజూరు చేసింది. దివ్యాంగుల ఆర్థిక పునరావాస పథకంలో భాగంగా సబ్సిడీని పొందింది. అయితే లోన్ కోసం రంగారెడ్డి జిల్లా కూకట్పల్లిలో ఓ బ్యాంకును ఆశ్రయించింది. కాగా ప్రభుత్వం నుంచి సబ్సిడీ మంజూరు సకాలంలో కాలేదు. దీంతో బాధితురాలు వాయిదాలు చెల్లించింది. మొత్తం బ్యాంకు నుంచి తీసుకున్న రుణం, వడ్డీతో సహా రూ.29.06 లక్షలు చెల్లించింది. కాని ప్రభుత్వం 2025లో సబ్సిడీని బాధితురాలి బ్యాంకు ఖాతాలో జమ చేసింది. కాగా అప్పటికే జేసీబీ కోసం తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించారు. అయితే తనకు మంజూరైన సబ్సిడీ డబ్బులను ఇవ్వాలని బాధితురాలు బ్యాంకు అధికారులను కోరింది. ఇందుకు అధికారులు సబ్సిడీలో సగం మాత్రమే ఇస్తామని, మిగిలిన దానికి అభ్యంతరాలు చెబుతూ కాలయాపన చేశారు. దీంతో విసుగు చెందిన బాధితురాలు భాగ్యలక్ష్మి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. లబ్ధిదారురాలికి బ్యాంకు నుంచి రావాల్సిన రూ.17.54లక్షల మొత్తాన్ని 9% వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. జేసీబీ వాహనాన్ని సీజ్ చేసి, బాధితురాలి ఉపాధిని దెబ్బతీసినందుకు రూ.5 లక్షలు, కోర్టు ఖర్చులు కింద రూ.10 వేలు చెల్లించాలని తీర్పేనిచ్చింది.
జేసీబీ సబ్సిడీ విషయంలో కోర్టుకు దివ్యాంగురాలు
రూ.17.54లక్షలు, 9శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశం
జేసీబీ సీజ్ చేసినందుకు రూ.5 లక్షల పరిహారం


