ఆటోడ్రైవర్ బలవన్మరణం
వర్గల్(గజ్వేల్): ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని మీనాజీపేటలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్ఐ ఆరోగ్యం కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పులబోయిన యాదగిరి, లక్ష్మి దంపతుల కుమారుడు వంశీ(24) ఆటో డ్రైవర్. వివాహం కాలేదు. సుమారు మూడు నెలల క్రితం ఒక ట్రాలీ ఆటోను కొనుగోలు చేసి, దానిని నడుపుతున్నాడు. నెలనెలా ఫైనాన్న్స్ ఈఎంఐలు చెల్లిస్తుండేవాడు. నెల రోజులుగా ఆటోకు గిరాకీ లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. ఫైనానన్స్ చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం గ్రామ డంపింగ్యార్డ్ వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కేసు నమోదు
రేగోడ్(మెదక్): పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మండలంలోని టి.లింగంపల్లి గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ పోచయ్య వివరాల ప్రకారం.. టి.లింగంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో కొందరు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం వచ్చింది. వెంటనే తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేయగా పేకాట ఆడుతున్న ఎనిమిది మందిలో ఏడుగురు పట్టుబడ్డారు. మరొకరు పారిపోగా.. ఏడుగురిని అరెస్ట్ చేసి వారివద్ద ఉన్న నగదు రూ.7,850, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.


