● వివరాలు వెల్లడించిన ఏసీపీ శ్రీనివాస్
పటాన్చెరు టౌన్: మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి పటాన్చెరు పోలీస్స్టేషన్లో ఏసీపీ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. రామేశ్వరంబండ వీకర్ సెక్షన్కు చెందిన మహమ్మద్ అలీం పాషా (24), పటాన్చెరుకు చెందిన ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. గతంలో బాలికను ఆమె తల్లిదండ్రుల అనుమతి లేకుండా తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆగస్టు 30న రాత్రి సుమారు 11 గంటలకు తన స్నేహితులైన వడ్డే రాజేశ్ అలియాస్ శివరాత్రి రాజేశ్, ముద్దం రాజు ముగ్గురూ కలిసి బాలికను తీసుకెళ్లే క్రమంలో ఆమె తల్లిదండ్రులు అడ్డుకుంటే దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే బాలికను నిందితుల నుంచి రక్షించి సైబరాబాద్ భరోసా కేంద్రానికి తరలించారు. అయితే పరారీలో ఉన్న నిందితులను మంగళవారం ఉదయం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో తన ఇంటికి వచ్చిన మహమ్మద్ అలీం పాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజేశ్, ముద్దం రాజులను కూడా అరెస్ట్ చేసి నిందితులపై పోక్సో చట్టం–2012లోని సెక్షన్లు 5, 6 తో పాటు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. కాగా అలీం పాషా గతంలో ఓ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. సమావేశంలో సీఐ రవీందర్, ఎస్ఐలు మహేశ్వర్ రెడ్డి ,వినోద్ ఆసిఫ్ అలీ , సిబ్బంది పాల్గొన్నారు.


