రైతులకు ఒకరోజు శిక్షణ
నర్సాపూర్ రూరల్: సేంద్రియ ఎరువులతో భూసారంతో పాటు సూక్ష్మజీవుల పెరిగి పంటలు ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మంగళవారం సేంద్రియ వ్యవసాయంపై తునికి కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా హర్టికల్చర్, డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో యుఎన్డీపీ–బయోపిన్ ప్రాజెక్టు లో భాగంగా మండలంలోని చిన్నచింతకుంటలో రైతులకు మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీకాంత్ రైతులకు సేంద్రియ వ్యవసాయంతో కలిగే లాభాలను వివరించారు. ఉద్యాన పంటల్లో సమగ్ర పురుగుల యాజమాన్యం ఐపీఎం, సమగ్ర పోషక యాజమాన్యం ఐఎన్ఎం గురించి చెప్పారు. అనంతరం వరి, కూరగాయలు ఇతర పంటల్లో సేంద్రియ ఎరువుల వినియోగం, విధానాల గూర్చి తెలిపారు. రైతులకు సేంద్రియ ఎరువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిత, ఉప సర్పంచ్ పెంటయ్య, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.


