కౌడిపల్లి(నర్సాపూర్): 108, 102 వాహనాలు అన్నిరకాల వసతులతో ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలని 108,102 వాహనాల జిల్లా కోఆర్డినేటర్ కిరణ్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రమైన కౌడిపల్లి గల వాహనాల నిర్వహణను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన వాహనాల్లో ఉండాల్సిన రికార్డులు, మందుల నిల్వల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర వాహనాలను ఖండిషన్లో ఉండడంతో పాటు, మందులు, చికిత్సకు అవసరమయ్యే ప్రాథమిక వస్తువులను అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ రాజు, శివ, పైలట్ జగన్, నవీన్, కెప్టెన్ నర్సింహులు పాల్గొన్నారు.
చిలప్చెడ్(నర్సాపూర్): పై ఫొటోలో ప్రశాంతంగా ఉన్న గేదెలను చూసి, ఏదో గేదెల పాక అనుకునేరు. కానే కాదు.. అది క్రీడా పాంగణం. గత ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన క్రీడా ప్రాంగణాలు ప్రస్తుతం కనుమరుగయ్యేలా ఉన్నాయి. చిలప్చెడ్ మండలం అంతారం గ్రామంలో గల క్రీడా ప్రాంగణం గేదెల నివాసానికి, ఆవాసంగా మారింది.
కంది(సంగారెడ్డి): ఓ కేసులో శిక్ష పడుతుందనే భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఏర్దనూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. పెద్ద నూరుకు చెందిన నవీన్ కుమార్(27) పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2022లో నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో మృతుడిపై పోక్సో కేసు నమోదైంది. కొంతకాలంగా వాయిదాలకు కూడా పోవడం లేదు. తనపై ఉన్న కేసులో శిక్ష పడుతుందేమోనన్న భయంతో గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
భూ వివాదంతో రైతు ఆత్మహత్యాయత్నం
మద్దూరు(హుస్నాబాద్): భూ వివాదంతో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన దూల్మిట్ట మండలంలోని లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన కొలిపాక యాదగిరి(52)అనే రైతు తన పేరుపై ఉన్న నాలుగెకరాల భూమిని తన తల్లి పోచమ్మ తిరిగి తన పేరుపై మార్పించుకుంది. కాగా అందులోని కొంత భూమిని తన ముగ్గురు కుమారైల పేర్లపై బదిలీ చేసింది. దీంతో యాదగిరికి, అక్కాచెల్లెళ్లతో గొడవలు జరుగుతుండడంతో ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించారు. కాగా పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికి సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో మస్తాపానికి గురైన యాదగిరి మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యాదగిరిని చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తలిరంచారు.
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు నడుం బిగించారు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మూడు రోజుల ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులు శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లలో భోజనం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ శంకర్ మాట్లాడుతూ... ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండలానికి చెందిన నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాలకు 2025లో పర్యావరణ పరిరక్షణలో రాష్ట్ర స్థాయి పురస్కారం లభించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రామకృష్ణ, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


