వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వ పాఠశాలల ప్రహరీల నిర్మాణంను కొంతమంది రైతులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా... మండలంలోని మానేపల్లి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఒకే ఆవరణలో ఉన్నాయి. దీంతోపాటు పక్కనే చెరువు, పెద్ద కాలువ ఉండటంతో ప్రహరీ నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలు మంజూరు చేసింది. కాగా సంబంధిత గుత్తేదారు పనులను ఇటీవల ప్రారంభించారు. ఈ క్రమంలో పాఠశాల ఆవరణ నుంచి తమ పంట పొలాలకు దారి ఉందని ప్రహరీ నిర్మించడానికి వీలులేదని గ్రామానికి చెందిన కొందరు రైతులు అడ్డుకున్నారు. దీంతో పునాది వరకు చేసిన పనులను గుత్తేదారు నిలిపివేశారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల రక్షణకు ప్రహరి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


