టమాటా ధర పతనం
● పారబోస్తున్న అన్నదాతలు ● కూలీల ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన ● గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకోలు
ములుగు(గజ్వేల్): టమాటా ధరలు గణనీయంగా పడిపోవడంతో సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను మార్కెట్కు తీసుకెళ్తే కూలీ డబ్బులు సైతం రావడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇక చేసేది ఏమి లేక పండిన టమాటా పంటను కొందరు రైతులు పొలాల్లోనే వదిలేస్తుండగా, మరికొందరు రోడ్డు పక్కన పారబోస్తున్నారు. దిగుబడులు బాగున్నా ధరలు పతనం కావడంతో లబోదిబోమంటున్నారు. ములుగు మండలంలో టమాటాను రైతులు ఎక్కువగా సాగు చేశారు. కొద్ది రోజుల క్రితం ధరలు ఆశాజనకంగానే ఉన్నా ఇటీవల క్రమంగా తగ్గుతూ వచ్చాయి. మొన్నటివరకు మార్కెట్లో 22 కేజీల బాక్స్ ధర టమాట కాయల నాణ్యతను బట్టి రూ.500 నుంచి 600 వరకు అమ్ముడు పోయేవి. ప్రస్తుతం రూ.100 నుంచి 200 వరకు అమ్ముడు పోతుండటంతో కనీసం కూలీ డబ్బులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు తీసుకెళ్లినా అమ్ముడు పోకపోవడంతో దిక్కుతోచని రైతులు ఆగ్రహంతో టమాటాలను వంటిమామిడి సమీపంలో రాజీవ్రహదారి పక్కన పారబోశారు. ప్రభుత్వం స్పందించి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


