ఎన్నికల సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పరిధిలోని జహీరాబాద్, కోహీర్, సదాశివపేట, సంగారెడ్డి, ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, జిన్నారం, అందోల్–జోగిపేట్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలకు ఎన్నికల సమన్వయకర్తగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలను దృష్ట్యా పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో సమన్వయం మెరుగుపరచడం లక్ష్యంగా మాజీమంత్రి హరీశ్రావు ఈ నియామకం చేసినట్లు ఆయన వివరించారు.
కోడ్ నిబంధనలు
పాటించకుంటే చర్యలే
సంగారెడ్డి డీఎస్పీ
సంగారెడ్డి క్రైమ్: మున్సిపల్ ఎన్నికల నియమ నిబంధనలను ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ తెలిపారు.విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ..మండలంలో ఎన్నికల ప్రవర్తన నియమాళి అమల్లో ఉండటంతో రాజకీయ సభలు, ర్యాలీలు, సమావేశాలకు ఎలాంటి అనుమతిలేదని పేర్కొన్నారు. అధిక మొత్తంలో డబ్బును తరలిస్తే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యక్తిగతంగా, అత్యవసర సమయాల్లో రూ.50 వేలకు మించి డబ్బును తమ వెంట తీసుకువెళ్లరాదని సూచించారు. ఇతరత్రా ఖరీదైన వస్తువులు టీవీ, ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కాని రూ.10 వేలకు మించి తీసుకువెళ్లరాదని, వస్తువుల రశీదు తప్పనిసరిగా చూపించాలని తెలిపారు. వాహనాల తనిఖీల్లో ప్రజలు తప్పనిసరిగా పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు.


