ఆగిపోయిన ప్రైవేట్ స్కూల్ బస్సు
శివ్వంపేట(నర్సాపూర్): విద్యార్థులను పాఠశాలకు తీసుకొస్తున్న ప్రైవేటు స్కూల్ బస్సు మార్గమధ్యలో ఆగిపోయింది. దీంతో ఆ బస్సును విద్యార్థులతో నెట్టిస్తున్న క్రమంలో ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా.. మండల కేంద్రమైన శివ్వంపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు మంగళవారం గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకొస్తుండగా చండీ గ్రామ శివారులో ఆగిపోయింది. దీంతో విద్యార్థులతో బస్సుని ముందుకు నెట్టించినప్పటికీ స్టార్ట్ కాలేదు. కాగా వెనుక వైపునకు రోడ్డు డౌన్ ఉండటంతో బస్సును వెనకకు నెడుతుండగా బ్రేక్ పనిచేయలేదు. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో పొలాల్లో ఉన్న రైతులు వచ్చి బస్సు టైర్ల కింద రాళ్లు పెట్టి ఆపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనాస్థలానికి వచ్చి ఆందోళన చేశారు. గతంలో ఇదే బస్సు రెండు సార్లు ఆగిపోయిందని, బస్సును మార్చాలని పలుసార్లు పాఠశాల సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు బద్దు, ఆంజనేయులు, పాండు, కుమార్, శ్రీకాంత్, తదితరులు ఆరోపించారు.
విద్యార్థులకు తప్పిన ప్రమాదం


