మేడారానికి ప్రత్యేక బస్సులు
● ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
● హుస్నాబాద్ డిపో నుంచి 50 బస్సులు
● ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర
హుస్నాబాద్: గిరిజన సంప్రదాయాలకు వేదికగా సమ్మక్క, సారలమ్మ జాతరకు ఉత్తర తెలంగాణలోని 51 బస్సు స్టేషన్ల ద్వారా ఆర్టీసీ సంస్థ 4 వేల బస్సులను ఏర్పాటు చేసినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ బస్టాండ్లో మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అమ్మవార్లకు పూజలు చేసి క్యూలెన్లను ప్రారంభించారు. అంతకు ముందు ఆర్టీసీ డిపోలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో సైదాపూర్, చిగురుమామిడి మండలాల దివ్యాంగులకు ఉపకరణాలు, ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. ఎల్లమ్మ దేవాలయంలో మాఘ నవరాత్రుల సందర్భంగా పొన్నం ప్రభాకర్ దంపతులు చండీహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ డిపో నుంచి మేడారం జాతరకు 50 బస్సులు ప్రత్యేకంగా కేటాయించామన్నారు. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాకుండా అమ్మవారి గద్దెల సమీపం వరకు వెళతాయని తెలిపారు. ప్రభుత్వం తరపున పోలీసుల సహకారంతో పిల్లలు తప్పిపోకుండా ఒక బాండ్ ఇస్తుందని దానిని వాడుకోవాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఫీల్డ్లో ఉండి పర్యవేక్షిస్తారన్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర కోసం వచ్చే భక్తులకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు కొత్త బస్సులు కొనుగోలు చేయడం, ఉద్యోగ నియామకాలు చేపట్టడం, నూతనంగా రెండు కొత్త డిపోలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. 341 బస్ స్టేషన్లు, 97 డిపోలు, 10 వేల బస్సులు, రోజుకు 65 లక్షల మంది, 35 లక్షల కిలోమీటర్ల మేర ఆర్టీసీ సంస్థ బస్సులను నడుపుతుందని తెలిపారు. వీటిని మరింత పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్ఎం రాజు, డిపో మేనేజర్ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
మంత్రి ఎత్తు బంగారం ఇచ్చిన అభిమాని
హుస్నాబాద్రూరల్: మండలంలోని పోతారం(ఎస్) గ్రామం ఒకటో వార్డు సభ్యురాలు యాదమ్మ సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఎత్తు బంగారం ఇచ్చి సమ్మక్క సారక్కకు మొక్కు చెల్లించుకుంది. కాగా సార్వత్రిక ఎన్నికల్లో పొన్నం గెలిస్తే అమ్మవారికి ఆయన ఎత్తు బంగారం ఇస్తామని మొక్కిన యాదమ్మ ఆ మేరకు మొక్కు చెల్లించింది.
మేడారానికి ప్రత్యేక బస్సులు


