విద్య, పరిశోధన రంగాల్లో ప్రగతి
ములుగు కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ
ములుగు(గజ్వేల్): విద్య, పరిశోధన, విస్తరణ రంగాల్లో విశ్వవిద్యాలయం గణనీయమైన ప్రగతిని సాధించిందని ములుగు కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయంలో సోమవారం ఆయన జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం ద్వారా ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డు పొందడం గర్వకారణమన్నారు. తెలంగాణలో ఉద్యాన సాగుకు ప్రణాళికను రూపొందించి ప్రభుత్వ సమక్షంలో అధికారికంగా ప్రారంభించారని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ స్థాయి బోధనా పోస్టులకు సంబంధించి మొత్తం 140 ప్రత్యక్ష నియామకాల కోసం ప్రభుత్వ అనుమతులు లభించాయన్నారు. పూర్తిగా ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, బోధన, బోధనేతర, కాట్రాక్ట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


