జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు రిత్విక్ ఎంపిక
మద్దూరు(హుస్నాబాద్): జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు దూల్మిట్ట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థి రిత్విక్ ఎంపికయ్యాడు. పాఠశాల హెచ్ఎం కరుణాకర్రెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మనోహరాబాద్లో జరిగిన 10వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలల్లో జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయినట్టు చెప్పారు. 9 నుంచి 12 వరకు హర్యానాలో జరిగే జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలలో రిత్విక్ పాల్గొంటాడని తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు రిత్విక్, వ్యాయామ ఉపాధ్యాయుడు సతీశ్కుమార్ను అభినందించారు.
కళాకారుల హర్షం
కోహెడరూరల్(హుస్నాబాద్): రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, 12 ఏళ్లుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కళాకారులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా నిలిచిందని ధూంధాం కళాకారుడు పొన్నాల అశోక్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అణచివేతకు గురై న్యాయ కోసం పోరాడుతున్న తమకు సీఎం రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడంపై కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్కు, ఉప ముఖ్యమంత్రి భట్టికి, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
వ్యక్తిపై కేసు నమోదు
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని వేచరేణి శివారు ఎల్లదాసునగర్ హనుమాన్ దేవాలయంలోని పలు వస్తువులు ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు కొమురవెల్లి ఎస్ఐ మహేశ్ తెలిపారు. ఎల్లదాసు నగర్కు చెందిన ఉబిది అజయ్ అనే వ్యక్తి స్థానిక హనుమాన్ దేవాలయంలోకి వెళ్లి పలు వస్తువులను ధ్వంసం చేయడంతో ఉపసర్పంచ్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆటోను ఢీకొన్న కారు..
ఆరుగురికి గాయాలు
రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఆటో డ్రైవర్ గాయపడ్డారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లికి చెందిన బోయిని ప్రవీణ్ కుటుంబం నిజాంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన పూజల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న ఆటోను అతివేగంగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆటోలో ఉన్న ప్రవీణ్, ఇందిర, అంజలి , మానస, కిరణ్తోపాటు ఆటో డ్రైవర్ ముత్యాలు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన అంజలి, ప్రవీణ్ను హైదరాబాద్కు తరలించారు.
ప్రాణం తీసిన అతి వేగం..
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
చేర్యాల(సిద్దిపేట): అతివేగంగా బైక్ నడుపుతూ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని చుంచనకోట శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, చేర్యాల పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్(30) అనే యువకుడు గ్రామానికి వెళ్లే క్రమంలో బైక్ అతి వేగంగా నడపడంతో చుంచనకోట సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్ తెలిపారు.
జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు రిత్విక్ ఎంపిక


