కొత్తూరు: పట్టణంలో కొనసాగుతున్న కేజీబీవీ హాస్టల్ను గురువారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఎంఈఓతో కలిసి తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థినుల అభ్యాసన తీరు, ఉపాధ్యాయుల బోధన పద్ధతులను గమనించి అవసరమైన సూచనలు చేశారు. విద్యార్థులు పాఠ్యాంశాలను మరింత సులువుగా అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని అన్నారు. అనంతరం పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. హాస్టల్ ఆవరణలో మరింత మెరుగైన పారిశుద్ధ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్ సాహితిరెడ్డికి సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ స్పెషలాఫీసర్ ప్రియాంక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
షాద్నగర్: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని మెప్మా పీడీ వెంకటనారాయణ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన జీవన్ధార ఫార్మసీని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఎన్నో పథకాలను రూపొందిస్తోందని తెలిపారు. సర్కారు అందిస్తున్న సహకారాన్ని మహిళా సంఘాల సభ్యులు వినియోగించుకోవాలని సూచించారు. జనరిక్ మందుల దుకాణాల్లో తక్కువ ధరకు నాణ్యతతో కూడిన మందులు లభిస్తాయన్నారు. చాలా మందిలో జనరిక్ మందులపై కొన్ని అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఎంసీ అశోక్, డీఈఓ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు: తిమ్మాపూర్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సతీమణి కావ్యారెడ్డి అన్నారు. గ్రామంలో దాత అభిషేక్ అగర్వాల్ సహకారంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ను గురువారం ఆమె ప్రారంభించారు. గ్రామస్తులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేలా ఆరోగ్య కేంద్రంతో పాటు తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్ను దాత సాయంతో ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు, జిల్లా ప్రధానకార్యదర్శి దేవేందర్రెడ్డి, స్థానిక సర్పంచ్ అంజమ్మ, నాయకులు అమరేందర్రెడ్డి, భిక్షపతి, రాజేందర్రెడ్డి, ఢిల్లీ వెంకటేశ్ ముదిరాజ్, మాదారం రమేష్గౌడ్, గౌర ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


