సాక్షి, రంగారెడ్డిజిల్లా: శంషాబాద్ మండలం సాతంరాయిలోని ప్రభుత్వ పాఠశాల సహా అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను అదనపు కలెక్టర్ కిరణ్మయి గురువారం తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, ప్రీ–స్కూల్ విద్య, కేంద్రం నిర్వహణ, పిల్లల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా నిర్వహించాలని సూచించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పారిశుద్ధ్యం, మౌలిక వసతులను పరిశీలించారు. ప్రజలకు వైద్య సేవలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పెద్దషాపూర్లో నిర్వహిస్తున్న స్కూల్ యూనిఫాం స్టిచ్చింగ్ సెంటర్ను సందర్శించారు. సెంటర్ నిర్వహణ, మౌలిక సదుపాయాలు, యూనిఫాం నాణ్యత, సమయానుసారం కుట్టుపని పూర్తి చేసే విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన యూని ఫాంలను నిర్ణీత సమయంలో అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, మౌలిక వసతులు, తరగతి గదుల నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రగతి, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు.


