కొత్తూర్: మండల పరిధిలోని పెంజర్ల పంచాయతీకి శనివారం అదనపు కలెక్టర్ కిరణ్మయి రానున్నట్లు ఎంపీడీఓ అరుంధతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, హెల్త్సెంటర్, ప్రభుత్వ కార్యాలయాలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు.
గ్రామాలను
అభివృద్ధి చేసుకోవాలి
మొయినాబాద్రూరల్: గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ అన్నారు. మండల పరిధిలోని కాశీంబౌలి, నదీమ్నగర్ గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. కాశీంబౌలి పంచాయతీ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్యంలో ఎలాంటి లోపాలు ఉండొద్దన్నారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, కమ్యూనిటీ గుంత, ఫాంపాండ్, ఊరికుంట నిర్మించుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో విక్రాంత్రెడ్డి, సర్పంచ్ మాడి రాజేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ మహాసభల వాల్పోస్టర్ ఆవిష్కరణ
చేవెళ్ల: కరీంనగర్లో వచ్చే నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి పిలుపునిచ్చారు. పట్టణ కేంద్రంలో శుక్రవారం మహాసభల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభల్లో కార్మికులు, ఉద్యోగులు, ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి భవిష్యత్తు కార్మిక ఉద్యమానికి కార్యాచరణ రూపొందించను న్నట్టు తెలిపారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలిరావాలని కోరారు.సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో అసంఘటిత రంగ కార్మికులు లక్షలాది మంది ఉన్నారని, వారు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాబోయే రోజుల్లో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ఎం.సత్తిరెడ్డి, ఎం.సుధాకర్గౌడ్, మక్బుల్, బాబురావు, శ్రీను, హనుమంత్, శంకర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
అనుమతులు లేని రోడ్డు నిర్మాణాల కూల్చివేత
మహేశ్వరం: ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన రోడ్డు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. మండల పరిధిలోని కొంగర ఖుర్దు–ఎ రెవెన్యూ సర్వే నంబర్ 298లోని ప్రభుత్వ పక్కనే ఆక్రమణదారులు కొంత భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వ భూమి నుంచి తప్పుడు కోర్టు ఆర్డర్లు చూపిస్తూ రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామస్తులు, రైతులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో శుక్రవారం తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు పోలీసుల సహకారంతో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన రోడ్డును జేసీబీలతో ధ్వంసం చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజిరెడ్డి, జీపీఓ అరుణ్, ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.


