22ఏ భూములు, ఆస్తులను జల్లెడ పడుతున్న సిబ్బంది మండలాల వారీగా లావాదేవీల పరిశీలన ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖకుసమాచారం తప్పుగా నమోదైన సర్వే నంబర్ల తొలగింపునకు అనుగుణంగా జీవోలు, మెమోలు అప్లోడ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నిషేధిత భూముల జాబితా (22–ఎ)పై దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం రెండు రోజులుగా నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను గుర్తించే పనిలో నిమగ్నమైంది. గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, హయత్నగర్, సరూర్నగర్, బాలాపూర్ మండలాల పరిధిలోని రెవెన్యూ గ్రామాల వారీగా సర్వే నంబర్లు, వాటి పూర్వ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా అర్బన్ లాండ్ సీలింగ్ (యూఎల్సీ) నుంచి పట్టా భూములుగా మారిన సర్వే నంబర్లు, వాటి విస్తీర్ణం, సరిహద్దులను గుర్తించి, నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో వేగం పెంచింది. ఒక్కో రెవెన్యూ పరిధిలో 40 వేల నుంచి 50 వేల చదరపు గజాల విస్తీర్ణం నిషేధిత జాబితాలో ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. వీటికి సంబంధించిన 765 జీఓలు, కోర్టు ఉత్తర్వులు, మెమోలను పోర్టల్లో అప్లోడ్ చేసింది. వచ్చే నాలుగైదు రోజుల్లో సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని భావిస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మిగులు భూముల విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
తీరనున్న సమస్యలు
హెచ్ఎండీఏ భూముల పరిశీలన
పట్టణ ప్రాంతాల్లో గతంలో పట్టణ భూగరిష్ట పరి మితి చట్టానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన రికార్డులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. అర్హత ఉన్న భూము ల విషయంలో నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నారు. గతంలో భూ రికార్డులు సవరించుకోని వారు, సంబంధిత ప్రక్రియను పూర్తి చేయని వారు సంబంధిత సబ్–రిజిస్ట్రార్ కార్యాలయం, రెవెన్యూ అధికారులను సంప్రదించి రికార్డులను పరిశీలించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని భూములకు సంబంధించిన రికార్డులను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన భూములు, ఆస్తులు, చట్టపరంగా 22–ఎ పరిధిలోకి వచ్చే భూములను మాత్రమే నిబంధనల ప్రకారం గుర్తించి జాబితాలో నమోదు చేస్తున్నారు. ఏదైనా పట్టా భూమి పొరపాటున 22–ఎ జాబితాలో నమోదై ఉంటే, అలాంటి భూములను పరిశీలించి, అందుబాటులో ఉన్న రికార్డులు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయా భూముల వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖకు పంపుతున్నారు. నిషేధిత జాబితా నుంచి వాటిని తొలగించి, పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తాజాగా మంగళవారం నిషేధిత జాబితాలో ఉన్న నాలుగు సర్వే నంబర్లలోని నాలుగు డాక్యుమెంట్లు కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది.
ఆందోళన అవసరం లేదు
22–ఎ జాబితాకు సంబంధించిన అంశాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ రికార్డుల నిర్వహణ, 22–ఎ జాబితాకు సంబంధించిన అంశాలు, ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులు, భూ రికార్డుల సవరణ ప్రక్రియ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 22–ఎ జాబితాలో నమోదైన భూములకు సంబంధించి కొన్ని సందర్భాల్లో పాత సర్వే నంబర్లు, కొత్త సర్వే నంబర్లకు జరిగిన మార్పులు, సరిహద్దులు, భూముల విభజన తదితర వివరాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
పట్టా భూములను గుర్తించే పనిలో రెవెన్యూ యంత్రాంగం


