● అవసరమైతే మరిన్నిసార్లు చర్చిస్తాం
● ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
యాచారం: రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయబోదని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల ఫార్మాసిటీ భూబాధిత రైతులతో జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి సమావేశమై వారి సమస్యలను విన్నారు. రైతులు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసి, టీజీఐఐసీ పేరుతో భూ రికార్డులు మార్చి పరిహారాన్ని అథారిటీలో జమ చేసిందని ఆరోపించారు. భూములు ఇచ్చే రైతులకు ఎకరాకు రూ.80 లక్షల పరిహారం ఇవ్వాలని, భూములు ఇవ్వని అన్నదాతల రికార్డులను తిరిగి వారి పేర్లపై నమోదు చేయాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి.. రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. అవసరమైతే మరిన్ని సమావేశాలు నిర్వహించి సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక అందజేయాలని కలెక్టర్ని ఆదేశించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా భూబాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచులు వెంకట్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్పై దాడి, అరెస్టు దుర్మార్గం
ఇబ్రహీంపట్నం రూరల్: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. జంతర్మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలో పోలీసుల చేసిన లాఠీఛార్జ్ను నిరసిస్తూ మండలంలోని చర్లపటేల్గూడ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో బుధవారం ఛాట్రోన్కి గూంజ్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని మండిపడ్డారు. 12 ఏళ్ల కాలంలో దాదాపు 152 పేపర్లు లీకేజీ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 7.50 కోట్ల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే క్యాన్సిల్ అయ్యాయన్నారు. ఇందుకు కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ వినియోగించడంపై హోంమంత్రి అమిత్షా స్టేట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి, వక్ఫ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సయ్యద్ ఖాలీద్, నాయకులు సికిందర్రెడ్డి, నాగేందర్రెడ్డి, గుర్రం శ్యామ్ చరణ్రెడ్డి, పాలడుగు నాగార్జున, గౌస్పాషా, గురునాథ్రెడ్డి, చిలుక మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


