ఇంగ్లిష్ కళ్లద్దాల్లాంటివి
శంకర్పల్లి: ప్రతి ఒక్కరికి మాతృభాష కంటి చూపు అయితే.. ఇంగ్లిష్ భాష కళ్లద్దాల్లాంటివని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దొంతాన్పల్లిలో నూతనంగా నిర్మించిన జెన్ బ్రైట్ పాఠశాలను సోమవారం ఆయన సినీ నటుడు మురళీ మోహన్, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయానని, తర్వాత తన తాత, నాయనమ్మతో కలిసి జీవించడంతో ఎన్నో విషయాలు నేర్చుకొన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ సమయం తమ తాత, నాయనమ్మలతో సమయం గడపాలని సూచించారు. యువత పెద్ద కలలను కని, కష్టపడి పని చేసి, జీవితంలో స్థిర పడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్రెడ్డి, పాఠశాల ఫౌండర్ ధన్యభారతి కణ్ణన్, కో–ఫౌండర్ త్రీకాంత్, దొంతాన్పల్లి సర్పంచ్ అజీజ్, పిల్లిగుండ్ల సర్పంచ్ స్వాతి కాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూసీ బాధితులను ఆదుకోవాలి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళన కోసం చేస్తున్న పనులు అభినందనీయమని, హైడ్రా ఏర్పాటు ప్రశంసనీయమని వెంకయ్యనాయుడు కొనియాడారు. మూసీ ప్రక్షాళన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా అదుకోవాలని సూచించారు. చాలా మంది అభివృద్ధి పేరుతో విరివిగా చెట్లు నరికేయడంతో పర్యావరణం విషతుల్యం అవుతోందని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పెద్ద వారితో పిల్లలు సమయం గడపాలి
మూసీ ప్రక్షాళన, హైడ్రా ఏర్పాటు అభినందనీయం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు


