ఎవరో పురాధీశులు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తికానుంది. ఇప్పటికే క్యాంపులకు వెళ్లిన అభ్యర్థులు నేరుగా మున్సిపాలిటీలకు చేరుకోనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఇక మ్యాజిక్ ఫిగర్ దాటక హంగ్ ఏర్పడిన మొయినాబాద్లో ఇప్పటికీ అదే ఉత్కంఠ కొనసాగుతోంది. స్వతంత్రు ల మద్దతుతో చేజిక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ సంపూర్ణ మెజార్టీతో చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోబోతోంది. ఆమనగల్లులో రాజకీయ సమీకణాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యేందుకు యత్నిస్తున్నాయి.
హస్తం గుప్పిట్లో ఆ స్వతంత్రులు
మొయినాబాద్ పరిస్థితి రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు రూ.కోట్లు ఖర్చు చేసినా ఇక్కడి ప్రజలు మాత్రం ఏ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు. 26 వార్డుల్లో 10 అధికార కాంగ్రెస్ గెలుపొందగా, ఏడు బీఆర్ఎస్, నాలుగు బీజేపీ విజయం సాధించాయి. ఐదు స్థానాల్లో స్వతంత్రులు (ముగ్గురు బీజేపీ రెబల్స్, ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్) గెలుపొందారు. ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ అనివార్యమైంది. పాలకమండలి ఏర్పాటులో స్వతంత్రులే కీలకంగా మారారు. 8వ వార్డు కౌన్సిలర్ మంచె శంకరయ్యను అదేరోజు అధికార పార్టీ సభ్యులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ క్యాంపులో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ రెబల్ 22వ వార్డు సభ్యుడు గరుగు రాజు సహా 21 వార్డు సభ్యురాలు అనసూయ, 11వ వార్డు సభ్యుడు మహేశ్ సైతం అధికార పార్టీకి మద్దతిచ్చేందుకు అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు సైతం తిరిగి హస్తం గూటికి చేరుకున్నట్లు సమాచారం. ఎక్స్ అఫీషియో ఓటుతో అవసరం లేకుండానే అధికార పార్టీ ఈ పీఠాన్ని కై వసం చేసుకోబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎక్స్ అఫీషియో ఓటు కలిగిన స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య మొయినాబాద్లో కాకుండా శంకర్పల్లిలో ఓటు హక్కు నమోదు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
తేలనున్న భవితవ్యం
అధికార కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులంతా ఆయా స్థానిక ఎమ్మెల్యేల మద్దతుదారులే కావడంతో చైర్మన్ పీఠం ఖరారు అంశం వారికి పెద్ద తలనొప్పిగా మారింది. నాకంటే.. నాకే ఇప్పించాల్సిందిగా వారు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తుండటంతో వారు ఎటూ తేల్చుకోలేక ఆ బాధ్యతను అధిష్టానానికి అప్పగించినట్లు తెలిసింది. ఖరారైన రిజర్వేషన్లకు అనుగుణంగా ఇప్పటికే చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులపై ఓ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. సీల్డ్ కవర్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం సోమవారం మధ్యాహ్నంలోపు తేలిపోనుంది.
నేటితో ఉత్కంఠకు తెర
సీల్డ్ కవర్లలో చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు
మొయినాబాద్లో ‘అధికారా’నికే స్వతంత్రుల మద్దతు
కారు ఖాతాలోనే ఇబ్రహీంపట్నం
ఆమనగల్లులో మారుతున్న సమీకరణాలు
ఎవరో పురాధీశులు!


