వీధి కుక్కల దాడిలో నాటు కోళ్లు మృతి
నందిగామ: వీధి కుక్కల దాడిలో నాటు కోళ్లు మృతి చెందిన ఘటన స్థానిక మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..నందిగామకు చెందిన శివగళ్ల పరుశురాం పెంచుతున్న నాటు కోళ్ల షెడ్డులోకి శనివారం రాత్రి కుక్కల గుంపు జొరబడి సుమారు 150 కోళ్లను కొరికేశాయి. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి అవి మృతి చెంది ఉన్నాయి. ఈ ఘటనను చూసి బాధితుడు లబోదిబోమన్నాడు. ఇంటి వద్ద నాటు కోళ్లను పెంచుతూ ఉపాధి పొందుతున్న తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
పహాడీషరీఫ్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..జల్పల్లి కార్గోరోడ్డులోని బాబా కాంట సమీపంలో ఓ వ్యక్తి పడి ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని గుర్తించారు. మృతుడి సంబంధీకులెవరైనా ఉంటే పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో గాని సంప్రదించాలని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.
ఇంట్లోకి చొరబడి యువతిపై కత్తితో దాడి
● ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్న యువకుడు ● నిందితుడి అరెస్ట్
మణికొండ: నిన్ను ప్రేమిస్తున్నా.. నా ప్రేమను అంగీకరించాలని ఓ యువకుడు ఓ యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడిచేశాడు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. అలకాపూర్ టౌన్షిప్లో ఓ యువతి(21) మరో ఇద్దరు యువతులతో కలిసి ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటుంది. అదే భవనంలో కొనసాగుతున్న ఓ హోటల్లో వెయిటర్గా పర్వతాల రోహిత్(23) పనిచేస్తున్నాడు. ఈనెల 1న యువతి కొత్త సంవత్సరం వేడుకల అనంతరం అర్ధరాత్రి ఇంటికి వచ్చింది. అప్పటికీ ఆమె మిత్రులు రాకపోవటంతో తలుపు తెరచి ఉంచి నిద్రకు ఉపక్రమించింది. రెండు నెలలుగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న రోహిత్ అదే అదనుగా ఇంట్లోకి చొరబడ్డాడు. యువతి అతన్ని గమనించి అరవటంతో కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో యువతి చేతికి గాయమైంది. అయినా అతను అసభ్యంగా ప్రవర్తించి పరారయ్యాడు. దీంతో బాధితురాలు ఈనెల 2 నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈవిషయమై సెక్టార్ ఎస్సై మునీందర్ను వివరణ కోరగా యువతిపై కత్తితో దాడి, అసభ్యంగా ప్రవర్తించిన రోహిత్పై ఫిర్యాదు వచ్చిందని, నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
అత్యాధునిక ఆవిష్కరణలు ఎంతో అవసరం
మహిళా శిశు సంక్షేమ శాఖా కార్యదర్శి అనితా రామచంద్రన్
రాయదుర్గం: తెలంగాణ ప్రభుత్వం ఒక శక్తివంతమైన మార్పునకు నాంది పలుకుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా కార్యదర్శి అనితా రామచంద్రన్ స్పష్టం చేశారు. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్బంగా ఆదివారం అసిస్టివ్ టెక్నాలజీ (ఏటీ) సమ్మిట్ ను హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్ వేదికగా నిర్వహించారు. సౌలభ్యత విషయంలో ముందుండాలంటే సాంకేతిక నైపుణ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల మంది దివ్యాంగ పిల్లల అవసరాలను తీర్చడానికి అత్యాధునిక ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమన్నారు. అసిస్టెక్ ఫౌండేషన్ సీఈఓ ప్రతీక్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పరికరాలను లబ్ధిదారులకు అందించారు.
వీధి కుక్కల దాడిలో నాటు కోళ్లు మృతి
వీధి కుక్కల దాడిలో నాటు కోళ్లు మృతి


