తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి
అబ్దుల్లాపూర్మెట్: తాటిపై నుంచి కింద పడి గీత కార్మికుడు మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతపల్లి గ్రామానికి చెందిన అంతటి సంతోష్(45) వృత్తి రీత్యా గీత కార్మికుడు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో తన పొలంలోని తాటి చెట్ల నుంచి తాటాకులు కోయడానికి వెళ్లి, రాత్రి 9 గంటల వరకు కూడా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన అతని భార్య ఉష తన కుమారుడితో కలిసి ఆచూకీ కోసం వెతకగా ఓ తాటిచెట్టు కింద సంతోష్ చెప్పులు కనిపించాయి. పరిసరాల్లో పరిశీలించగా తాటిచెట్టు కింద ఉన్న బావిలో పడి విగత జీవిగా కనిపించాడు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు గ్రామస్తుల సహకారంతో బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
మ్యాన్హోల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
రాంగోపాల్పేట్: ఓ హోటల్ సమీపంలోని మ్యాన్ హోల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ ఎస్డీరోడ్లోని గ్రాండ్ మినర్వా హోటల్ వెనుక వైపు హోటల్కు సంబంధించిన డ్రైనేజీ మ్యాన్హోల్ ఉంది. బుధవారం హోటల్కు సంబంధించిన మురుగు నీరు వెళ్లకపోవడంతో తనికీ చేసిన ప్లంబర్ మ్యాన్హోల్లో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా పరిశీలించిన పోలీసులు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి ఒంటిపై ప్యాంటు, చొక్కా మాత్రమే ఉన్నాయి. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ సైదయ్య, ఇన్స్పెక్టర్ పరశురాం, డీఐ ప్రసాద్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి బలవన్మరణం
హిమాయత్నగర్ : ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బాల్యతండాకు చెందిన ధరావత్ రాందాస్ కుమారుడు ధరావత్ ప్రవీణ్ కుమార్(20) నారాయణగూడలోని అభ్యశ్రీ బాయ్స్ హాస్టల్లో ఉంటూ జేఈఈ మెయిన్స్కు కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండుసార్లు ప్రయత్నించినా ర్యాంక్ రాకపోవడంతో మనస్తాపానికి లోనైన అతను ఈనెల 12న తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాధపడగా వారు అతడికి సర్దిచెప్పారు. మంగళవారం తల్లిదండ్రులు ప్రవీణ్కు ఫోన్ చేయగా అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆందోళనకు గురైన వారు బుధవారం ఉదయం హాస్టల్కు వెళ్లి చూడగా ప్రవీణ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
బాలుడి అనుమానాస్పద మృతి
కీసర: అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడు మృతిచెందిన సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చీర్యాలకు చెందిన మహేష్, మంజుల దంపతుల కుమారుడు బర్లపాటి వర్ధన్ (17) 10 వ తరగతి చదువుకున్నాడు. ప్రస్తుతం కరెంట్ బిల్లుల రీడింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గది నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా వర్ధన్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. నాలుగు రోజుల క్రితమే అతను మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. వర్ధన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి


