● వీడియో కాల్లో మాట్లాడిన జడ్జి ● పరస్పర అంగీకారంతో కేసు క్లోజ్
వేములవాడ: దూరభారాలు సత్వర న్యాయానికి అడ్డంకి కాదని వేములవాడ లోక్అదాలత్ నిరూపించింది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వ్యక్తి ఇక్కడి కోర్టులో కొనసాగుతున్న కేసును వర్చువల్గా హాజరై క్లోజ్ చేయించుకున్నారు. రుద్రంగి మండలం డెగావత్తండాకు చెందిన కున్సత్ సుమన్ రెండేళ్ల క్రితం కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదం కేసు వరకు వెళ్లింది. రుద్రంగి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సుమన్ ఇటీవల దుబాయ్ వెళ్లాడు. రుద్రంగి ఎస్సై మోతీరాం కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి శనివారం వేములవాడ కోర్టులో జరిగిన లోక్ అదాలత్కు హాజరయ్యేలా చూశారు.
వీడియోకాల్ ద్వారా విచారణ
కేసు విచారణలో భాగంగా వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ దుబాయ్లో ఉన్న సుమన్తో వీడియోకాల్లో మాట్లాడారు. ఇరువర్గాలు రాజీకి రావడం, సుమన్ వర్చువల్గా సమ్మతి తెలపడంతో రెండేళ్లుగా నడుస్తున్న ఈ కేసును జడ్జి క్లోజ్ చేశారు.
429 కేసులు పరిష్కారం
వేములవాడ కోర్టులో జరిగిన లోక్ అదాలత్లో 429 కేసులకు పరిష్కారం లభించినట్లు సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ తెలిపారు. బాధితులకు రూ.30,500 పరిహారం జమయినట్లు అధికారులు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసులు, పీపీ విక్రాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్, ఏపీపీలు బొడ్డు ప్రశాంత్, రజనీకాంత్, లోక్ అదాలత్ మెంబర్లు నేరెళ్ల తిరుమల్గౌడ్, అనిల్కుమార్, సీఐలు శ్రీనివాస్, కె.రవీందర్, ఎస్సైలు మోతీరాం, ప్రశాంత్ పాల్గొన్నారు.


