సిరిసిల్లటౌన్/పెద్దపల్లి/మెట్పల్లి/ధర్మపురి: సిరిసిల్ల బల్దియా, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏటా ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది సైతం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సిరిసిల్లలోని చింతోజు భాస్కర్ మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పదేళ్లుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. 24వ వార్డులో మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీనిధి పరస్పర సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. పదిహేనేళ్లుగా వార్డులోని 350 ఇళ్లకు మట్టి వినాయకులను అందిస్తున్నారు. శివనగర్ రాజరాజేశ్వరస్వామి ఆలయం వేదికగా ఏడాదికి 2 వేల వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నారు.
● పెద్దపల్లికి చెందిన దేవసాని పద్మ కుటుంబం పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పదేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు.
● మెట్పల్లి లయన్స్క్లబ్ సభ్యులు మట్టి గణపతులను పూజించాలని ప్రచారం చేస్తున్నారు. 2009లో మెట్పల్లిలో లయన్స్క్లబ్ ఏర్పాటు చేశారు. ఏటా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు అధ్యక్షుడు శ్రీనివాస్రావు తెలిపారు.
● ధర్మపురికి చెందిన గాజు భాస్కర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో 500 మందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు వద్దని.. మట్టి విగ్రహాలను పూజిద్దామని ప్రచారం చేస్తున్నారు.


