హైదరాబాద్ తర్వాత పెద్దపల్లికి గుర్తింపు వచ్చేలా భారీ మట్టిగణపతిని ఏర్పాటు చేస్తున్నాం. నవరాత్రోత్సవాల్లో ప్రముఖుల ప్రవచనాలు, లక్షపుష్పార్చన, మహాహారతి, సహస్రదీపాలంకరణ ఇలా రోజుకో ప్రత్యేక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నాం.
– శివంగారి సతీశ్,
ఛత్రపతి యువసేన వ్యవస్థాపక
అధ్యక్షుడు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈసారి 63అడుగుల పంచముఖ గణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు శివంగారి సతీశ్ ఆధ్వర్యంలో ఏటా భారీ ఎకో గణేశుడు పూజలందుకుంటున్నాడు. 31ఏళ్లుగా ఉత్సవాలను నిర్వహిస్తుండగా.. ఎనిమిదేళ్లుగా భారీ మట్టి గణపతులను ఏర్పాటు చేస్తున్నారు. 36 ఫీట్ల ఎత్తుతో మొదలై ఈ ఏడాది 63 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటున్నాడు. ఖైరతాబాద్ తర్వాతిస్థానంలో పెద్దపల్లిలోనే భారీ గణేశుడు కొలువుదీరేలా నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు.


