● ఇది సిరిసిల్ల పట్టణంలోని పెద్దబజారు హనుమాన్ ఆలయం. 28వ వార్డుకు సంబంధించిన ఓటర్లకు నోటీసులు జారీచేయడంతో ఆధారాలతో వచ్చి ఇలా ఆన్లైన్లో లైవ్ ఫొటోలు దిగుతున్నారు. లైవ్ ఫొటో దిగేటప్పుడు కంటిరెప్పలను ఆడించాలి. అలా కంటి రెప్పలను ఆడిస్తేనే ఓటరుగా జీవించి ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. నోటీసులు అందుకున్న ఓటర్లు విధిగా 12 గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒక్కటి జతచేసి అందించి, సంతకం చేయాలి. అలా చేస్తేనే ఓటు హక్కు లభిస్తుంది.
● ఇది సిరిసిల్లలోని పెద్దబజారులోని మరో బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్వో), బూత్ లెవల్ ఏజెంట్(బీఎల్ఏ) శిబిరం. ఈ అధికారికి 1,140 ఓటర్ల జాబితా ఇవ్వగా.. ఇందులో 285 మంది ఓటర్లకు నోటీసులు జారీచేశారు. మరో 300 మంది ఓటర్ల చిరునామాలు గల్లంతయ్యాయి. ఇందులోనే కొందరు మృతులు ఉన్నారు. అడ్రస్ లేని వారికి నోటీసులు జారీ చేయలేక.. చనిపోయిన వారిని గుర్తించి నమోదుచేస్తూ ఓటర్ల జాబితా, నోటీసులతో ఇలా కుస్తీలు పడుతున్నారు.
అక్షర దోషాలకు బాధ్యులెవరూ ? వివిధ కారణాలతో 83,846 మందికి నోటీసులు ఇప్పటికే 70,952 మందికి జారీ పెండింగ్లో 12,894 నోటీసులు
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అక్షర దోషాలు, వయసు తేడాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటర్ల జాబితా నమోదు సమయంలో ఇంగ్లిష్లో నమోదు చేయడంతో తెలుగులో జాబితా రావడంతో అనేక అక్షర దోషాలు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పుడు చాలా మంది ఓటర్ల నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. మరోవైపు తల్లిదండ్రుల వయసుతో పిల్లల వయసును పోల్చినప్పుడు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల తేడా మాత్రమే ఉండడంతో ఆ ఓటర్లను బోగస్గా భావిస్తున్నారు. నిజానికి వయసు నమోదులోనూ తేడా ఉండడమే
ఇందుకు కారణం. ఖచ్చితమైన వయసు నిర్ధారణ పత్రాలను పరిశీలించకుండానే బూత్ లెవల్ ఆఫీసర్లు, అప్పట్లో వీఆర్వోలు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఆ ఓటర్ల జాబితాను ఆన్లైన్ చేయడంలో తప్పులు దొర్లి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.