సిరిసిల్ల: జిల్లాలో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యాటక రంగం అంశంపై పోటీలు నిర్వహించాలన్నారు. పర్యాటకరంగ అభివృద్ధికి నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ మాట్లాడారు. టూరిజం శాఖ డీఈ శ్రీశైలం, డీవైఎస్వో రాందాస్, డీటీసీపీవో అన్సార్, అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి మోహన్లాల్ పాల్గొన్నారు.
పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై
ఉత్తమ రీల్స్ పోటీలు
ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై ఉత్తమ రీల్స్, వ్యూస్ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ వద్ద ఉన్న ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ గుడి చెరువులో ఉన్న వీటీఏడీఏ పార్క్, నాంపల్లిగుట్టకు సంబంధించిన ఉత్తమ రీల్స్, ఎక్కువ వ్యూస్ వచ్చే వారు ఈనెల 20 వరకు పంపించాలని సూచించారు. అత్యుత్తమ రీల్స్కు మొదటి బహుమతి రూ.15వేలు, రెండో బహుమతి రూ.10వేలు, మూడో బహుమతి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. ఉత్తమ రీల్స్ రూపొందించి.. ఎక్కువ వ్యూస్ వచ్చిన రీల్స్ లింక్ 94402 39783కు వాట్సాప్ చేయాలని కోరారు.


