సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో కార్మికక్షేత్రం దద్దరిల్లింది. మంగళవారం అంబేడ్కర్ చౌరస్తాలో వందలాది సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులతో అడ్డుకున్నారని, మహిళ ఎమ్మెల్యేల పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి అప్రజాస్వామిక విధానాలను మానుకోవాలని సూచించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెక్కి ఒక్కటి కూడా అమలు చేయని చేతగాని ప్రభుత్వంగా విమర్శించారు. వందలాది సంఖ్యలో బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో పోలీస్, పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పలుమార్లు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు సీఎం ఫొటోలు చించి, కాంగ్రెస్ ఫ్లెక్సీ ముక్కలను దహనం చేశారు. తోపులాటలో బీఆర్ఎస్వీ నాయకుడు కంచర్ల రవిగౌడ్ తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్క్సాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్చైర్మన్ దార్ల సందీప్, సిరిసిల్ల ఇన్చార్జి తుల ఉమ, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


