వేములవాడ: శ్రావణమాసంలో చివరి సోమవారం సందర్భంగా భీమన్నను దర్శించుకునేందుకు 1,05,600లకు పైగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంతాలు రద్దీగా మారాయి. షవర్ల వద్ద స్నానాలు చేసిన భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. తడిబట్టలతో భీమన్నకు కోడె కట్టారు. అభిషేకాలు, అన్నపూజలు, సత్యనారాయణవ్రతాలు, కల్యాణాలు, కుంకుమపూజలు నిర్వహించారు. భక్తుల ద్వారా రూ.78 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను డీఈవో ప్రతాప నవీన్, ఏఈవో మహేశ్, పర్యవేక్షకులు పరిశీలించారు.
కోడె మొక్కులకు కొట్లాట
భీమన్నకు కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్యూలైన్ భారీగా పెరిగిపోయింది. కోడె మొక్కులు చెల్లించుకునే ప్రాంతంలో గొడవ జరిగింది. పీఆర్వో కార్యాలయం నుంచి ఇచ్చే స్పెషల్ కోడె టికెట్లను అధికారులు నిలిపివేయడంతో గొడవ సద్దుమణిగింది.


