భవిష్యత్పై భరోసా
చదువుతోపాటు ఉద్యోగ నైపుణ్యాలు
గంభీరావుపేట(సిరిసిల్ల): డిగ్రీ, పీజీ చదువులతోపాటు ఉద్యోగాలు సాధించే నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. భవిష్యత్పై భరోసా కల్పిస్తున్నారు. కొన్ని రోజులుగా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహిస్తున్న టాస్క్ శిక్షణ గురువారం ముగిసింది. డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులు 200 మంది ఉద్యోగాలకు అవసరమైన వివిధ నైపుణ్యాలు సాధించారు. సంభాషణ నైపుణ్యాలు, ఆంగ్ల భాషలో మాట్లాడే సామర్థ్యం, వ్యక్తిత్వ వికాసం, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సమయపాలన వంటి అంశాలను అభివృద్ధి చేయడానికి టాస్క్ శిక్షణలో ఇస్తారు.
ఉద్యోగ సాధనకు మార్గదర్శకత్వం
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే విధానం, స్వీయ వివరాల పత్రం తయారీ, ఇంటర్వ్యూలను ఎదుర్కొనే తీరు, గ్రూప్ డిస్కషన్లో పాల్గొనే విధానం వంటి అంశాలపై విద్యార్థులకు దశలవారీగా అవగాహన కల్పిస్తారు. దీంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగడంతో పాటు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యం పెరుగుతుంది.
సాంకేతిక నైపుణ్యాలకు ప్రాధాన్యం
ప్రస్తుతం కంప్యూటర్, డిజిటల్ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలను కూడా విద్యార్థులకు అందించడంపై టాస్క్ దృష్టి సారిస్తోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంతోపాటు శిక్షణ, ఉద్యోగావకాశాలు, ఉద్యోగ నియామకాలపై మార్గదర్శకత్వం అందించనుంది.
గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం
గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే. అలాంటి వారికి కళాశాల విద్యార్థులకు విద్యతో పాటు భవిష్యత్లో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను అందించడం వారికి ప్రయోజనకరంగా మారనుంది. విద్యను ఉద్యోగ నైపుణ్యాలతో అనుసంధానం చేసి ఉపాధికి సిద్ధం చేయడమే లక్ష్యంగా టాస్క్ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.


